Sakshi News home page

మోడీకి షాకిచ్చిన ఎస్‌అండ్‌పీ

Published Fri, Nov 24 2017 6:42 PM

S&P maintains India ratings at 'BBB-', says outlook stable  - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మోడీ సంస్కరణలకు మెచ్చిన మూడీస్‌ భారత క్రెడిట్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయగా.. మరో రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ మాత్రం మోడీకి షాకిచ్చింది. భారత సావరిన్‌ రేటింగ్‌ను ఎస్‌అండ్‌పీ అప్‌గ్రేడ్‌ చేయలేదు. భారత సావరిన్‌ రేటింగ్‌ను స్థిరంగా 'బీబీబీ-'గానే ఉంచింది. అదేవిధంగా భారత్‌పై తన అవుట్‌లుక్‌ను కూడా స్థిరంగానే ఉంచుతున్నట్టు తెలిసింది. మూడీస్‌ అప్‌గ్రేడ్‌ అనంతరం ఎస్‌అండ్‌పీ కూడా భారత రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తుందని అందరూ భావించారు. కానీ తాజాగా ఎస్‌అండ్‌పీ మాత్రం తన రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయకుండా, ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. మూడీస్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌తో వరుసగా ఏడు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి సెన్సెక్స్‌ లాభపడుతూ వస్తోంది.

భారత్‌లో అత్యధిక మొత్తంలో ద్రవ్యలోటు, తక్కువ తలసరి ఆదాయం, ప్రభుత్వం రుణాలు బలహీనమైనవిగా ఎస్‌అండ్‌పీ పేర్కొంది. రెండు క్వార్టర్ల నుంచి అంచనావేసిన దాని కంటే తక్కువ వృద్ధి నమోదైనప్పటికీ, 2018-20లో భారత ఆర్థికవ్యవస్థ వేగవంతంగా పరుగులు తీయగలదని ఈ రేటింగ్‌ సంస్థ అంచనావేస్తోంది. ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ రిజర్వులు పెరుగుతూ ఉంటాయని తెలిపింది. అయితే తక్కువ తలసరి ఆదాయం, అధిక మొత్తంలో ద్రవ్యలోటు, ప్రభుత్వంపై ఉన్న రుణ భారం దేశీయ సావరిన్‌ క్రెడిట్‌ ప్రొఫైల్‌పై ప్రభావం చూపుతున్నట్టు ఎస్‌అండ్‌పీ వివరించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత తొలిసారి మూడీస్‌ భారత సావరిన్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెంచింది. రేటింగ్‌ అవుట్‌లుక్‌ను కూడా స్టేబుల్‌ నుంచి పాజిటివ్‌కు మార్చింది.‌

Advertisement
Advertisement